Monday, 12 September 2016

పశ్చిమ తమిళనాడులో నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఒక సామాజిక సాంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. దాన్ని ఆచార్య పెరుమాళ్ మురుగన్ తమిళంలో ‘మధోరు బాగన్’ అనే నవలగా 2010లో రాశాడు. దాని తెలుగు అనువాదమే “అర్థనారీశ్వరుడు.” 1940 సంII నేపథ్యంలో వ్యవసాయము, పశుపోషణ జీవనంగా గల ఒక జంట కాళి, పొన్నల కథ ఇది. ఎన్ని “గుళ్ళూ, గోపురాలు దర్శించినా” సంతానం కలగదు. పిల్లలు కలగనప్పుడు తిరుచెంగోడు అర్థనారీశ్వరుడికి జరిగే రథోత్యవం వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదిలి, ఆ రాత్రి ఎవరు ఎవరితోనైనా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనవచ్చుననే సాంప్రదాయం ఆనాడు ఉండేది. దీని నాధారంగా చేసుకొని హృద్యంగా ఈ నవల రచించబడింది. పశ్చిమ తమిళనాడులోని కొంగునాడు ప్రాంతంలోని కొన్ని సామాజిక వర్గాలు మురుగన్ మీద కాలు దువ్వినాయి. అలజడి ప్రారంభమయింది. ఈ నవలలో ప్రస్తావించిన అంశాలు తమ సామాజిక వర్గాన్ని, స్త్రీలను కించపరచేవిగా ఉన్నదనీ, దీన్ని నిషేధించాలనీ కొన్ని హిందూ మతోన్మాద సంస్థలూ, కుల సంఘాలు, వక్రమార్గంలో ఎడతెరిపి లేని అందోళన అన్ని రూపాల్లో కొనసాగించాయి. రచయితైన మురుగన్‌ను వేటాడారు. దాదాపుగా సాంఘిక బహిష్కరణ చేశారు. మురుగన్‌తో ప్రభుత్వ అధికారుల సమక్షంలో క్షమాపణ చెప్పించాయి. అయినా గొడవ కోర్టుదాకా వెళ్ళింది. విచారణ సంIIర కాలం జరిగింది. మతోన్మాదుల ఉన్మాదాన్ని కోర్టు కొట్టివేసింది. ఈ రచనను తెలుగులోకి ప్రసిద్ధ రచయిత ఎల్.ఆర్. స్వామి అనువదించారు.

No comments:

Post a Comment

Visalaandhra Publishing House