Friday, 16 September 2016

మధ్యతరగతి కుటుంబ జీవనం చుట్టూ నడిచిన కథ. కుటుంబ జీవనం లో వుండే ఆటుపోట్లు, అత్తగారి అసహనాలు, అన్నదమ్ముల ఆప్యాయతలు, రాగానురాగాలు, అక్కడక్కడ ప్రేమ మైకాలు, ఊహాచిత్రాలతో పాఠకులను ఆకట్టుకుంటుంది ఈ నవల. హద్దుల్లో ఉండే భార్యాభర్తల "శృంగారం" అక్కడక్కడ ఆనందాన్ని కలిగిస్తుంది. మనస్సును ఆహ్లాదపరుస్తుంది. ఉన్నత వర్గాల జీవనాన్ని అనుకరించే పాత్రలున్న కుటుంబంలో పక్కదారి పట్టే వ్యక్తులనూ ప్రత్యేకించి యువతీ యువకులను సరిదిద్దడంలో పరిణతిచెందిన ఒకపాత్ర చిత్రణ ఆమోదయోగ్యంగా వుంది.
గడ్డం కోటేశ్వరరావు
సంపాదకుడు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
ఈ అపురూప నాటక కథలులో షేక్స్‌పియర్ రచిచంచిన వెన్నిస్ వర్తకుడు, కింగ్ లియర్, కవలల కలకలం, నడిరేయి మిడిమేలం, జూలియస్ సీజర్, మేక్బెత్ ఆరునాటకాలను కథారూపంలో మీకు అందిస్తున్నాం. ఈ ఆరూ సుప్రసిద్ధమైనవే. ఆనంద ఆశ్చర్య వినోదాలతో పాటు లోకంలోని వివిధ రకాలయిన వ్యక్తులు, వారి గుణ స్వభావాలు- ఆశ, లోభం, క్రోధం, మోహం అహంకారం మనుషుల్ని ఎలా బలితీసుకుంటాయో ఈ కథల్లో ఆయా పాత్రల ద్వారా మనకు తేటతెల్లమవుతుంది. మనుషుల్లో ప్రాథమికంగా ఉండాల్సిన దయ, కరుణ, ప్రేమలను ఈ కథలు ప్రభోధిస్తాయి. షేక్స్‌పియర్ రచనలలో సర్వకాలీన మానవునికి అవసరమైన మానవీయత నిక్షిప్తమై ఉంటుంది. అందుకే శతాబ్దాలు గడచినా నేటికీ షేక్స్‌పియర్ మన మధ్యనే ఉన్నాడు.
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
పని వత్తిడి నుంచీ, బరువు బాధ్యతల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛగా, హాయిగా రోజులు గడపవలసిన దశ రిటైర్డు జీవితం. కాని, చాలామంది పెద్దల విషయంలో వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉండడం విచారకరం. జీవితంలో ఏ దశ అయినా సజావుగా సాగాలి అంటే అందుకు మనకు ముందుచూపు ముఖ్యం. ఒక పథకం, ఒక వ్యూహం ఉండాలి.
ఆర్జన, ఆరోగ్యం, పరపతి, పెత్తనం అన్నీ తగ్గుముఖం పట్టిన రిటైర్డు జీవితాన్ని దాదాపు రెండు మూడు దశాబ్దాల కాలం సంతృప్తికరంగా గడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఉద్యోగంలో ఉన్నప్పుడే తగిన ప్రణాళిక సిద్ధపరచుకొని, దానిని జాగ్రత్తగా అమలుచేసిన వివేకవంతులు మాత్రమే ఈ రోజుల్లో తమ శేష జీవితాన్ని హాయిగా గడపగలుగుతున్నారు. అమాయకంగా, అశ్రద్ధగా రిటైర్డ్ జీవితంలో అడుగుపెట్టేవాళ్ళు అనేక సమస్యలపాలవుతున్నారు. అటువంటి మంచి ప్రణాళిక కోసం అందరికీ ఉపయోగపడే పుస్తకం ఇది.
కె. రామిరెడ్డి
ఆత్మవిశ్వాసం ముందు అవిటితనం తల ఒగ్గాల్సిందే. మనిషి కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉంటూ, నాలుగు దశాబ్దాలుగా నాడీమండల వ్యాధితో పోరాడుతూ, సరికొత్త శాస్త్రవిజ్ఞానాన్ని పంచిపెడుతున్న స్టీఫెన్ హాకింగ్ మానవాళి చరిత్రలో మహోన్నత శాస్త్రవేత్తగా నిలిచిపోతాడు. స్టీఫెన్ హాకింగ్ జీవిత విశేషాలు అందరూ తెలుసుకో దగ్గవి. ఈ పుస్తక రచనలో అంశాలన్నీ ఎంతో సంక్షిప్తంగా సమకూర్చడం జరిగింది. ఎన్నో ప్రచురణల్లో వెలువడిన విషయ సేకరణలను ఆకళింపు చేసుకొని, సంక్షిప్తంగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది.
ఆర్. రామకృష్ణారెడ్డి
నిప్పును ఎవరు కవుగొన్నారు... చక్రాన్ని ఎవరు రూపొందించారు... నేడు అందరూ ఎంతో ఇష్టపడే కాఫీకి మూలం ఎవరు... దూరాన ఉన్న మనుషులను సైతం మాటలతో కలిపే టెలిఫోన్ రూపకర్తలు ఎవరు... ఇటువంటి ఎన్నో విషయాలను నాటి చరిత్రగా మిగిలిపోయినా... నేటికి... రేపటికి కూడా నూతనంగానే ఉంటాయి. ఇక్కడి ఆర్యభట్ట నుండి అక్కడి ఐన్‌స్టీన్... ఇలా ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తల జీవితాలే కాదు, వారి పరిశోధనలు చరిత్రలుగా మిగిలినా భవిష్యత్ ప్రగతికి కొత్తమార్గాల అన్వేషణలో సహాయపడుతూనే ఉన్నాయి. నిత్య నూతనంగా... విజ్ఞాన సంబంధమైన విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఎంతోమందికి ఉన్నా... క్లిష్టమైన భాష అడ్డుగా మారింది. ఆయాఅంశాలు మాతృభాషలో లభిస్తే ఎంతో ఉపయుక్తం. కనీసం క్లుప్తంగానైనా మాతృభాషలో ఉండి పలు అంశాలు ఒకేచోట చేర్చితే చదువరులకు ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించడంతో పాటు భద్రపరచుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆ ప్రయత్నమే ఇది.
నిప్పును ఎవరు కవుగొన్నారు... చక్రాన్ని ఎవరు రూపొందించారు... నేడు అందరూ ఎంతో ఇష్టపడే కాఫీకి మూలం ఎవరు... దూరాన ఉన్న మనుషులను సైతం మాటలతో కలిపే టెలిఫోన్ రూపకర్తలు ఎవరు... ఇటువంటి ఎన్నో విషయాలను నాటి చరిత్రగా మిగిలిపోయినా... నేటికి... రేపటికి కూడా నూతనంగానే ఉంటాయి. ఇక్కడి ఆర్యభట్ట నుండి అక్కడి ఐన్‌స్టీన్... ఇలా ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తల జీవితాలే కాదు, వారి పరిశోధనలు చరిత్రలుగా మిగిలినా భవిష్యత్ ప్రగతికి కొత్తమార్గాల అన్వేషణలో సహాయపడుతూనే ఉన్నాయి. నిత్య నూతనంగా... విజ్ఞాన సంబంధమైన విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఎంతోమందికి ఉన్నా... క్లిష్టమైన భాష అడ్డుగా మారింది. ఆయాఅంశాలు మాతృభాషలో లభిస్తే ఎంతో ఉపయుక్తం. కనీసం క్లుప్తంగానైనా మాతృభాషలో ఉండి పలు అంశాలు ఒకేచోట చేర్చితే చదువరులకు ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించడంతో పాటు భద్రపరచుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆ ప్రయత్నమే ఇది.
భారతదేశంలోని మార్క్సిస్టు మేధావులను ప్రత్యేకించి, ఉత్తర భారతంలోని మేధావులను ఆయన తాత్విక చింతన ప్రభావితం చేసింది. స్వీయానుభవం, స్వీయ పరిశీలన, అధ్యయన ప్రాతిపదికగా ఆయన రచనలు సాగాయి. మార్క్సిస్టు గతితర్కాన్ని ఆయన ఆలోచనలను అనుగణంగా భారతదేశ చరిత్రకు, తాత్విక ధోరణులకు అనువర్తింపచేశాడు.
"మానవజాతి ప్రగతిపథంవైపు సాగించిన ప్రతి అడుగూ రక్తతర్పణంతోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మాచార్యులే కారణం; వారే భాధ్యులు. ఏ ఒక్క మతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించవల్సింది ఏమీలేదు" అని చారిత్రక ఆధారాల రీత్యా తన రచనల ద్వారా ఆయన రుజువు చేశాడు. ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణంలో రాహుల్జీ పుస్తకాల పఠనం అత్యంత ఆవశ్యకం.
ఇందులో భాగంగానే ఆర్యసమాజ ఇతివృత్తంగా దివోదాసు నవల, బుద్ధుడి సత్యజ్ఞాన సంపాదనను గూర్చి లోకసంచారి అనే సంకలనం.

Monday, 12 September 2016

పశ్చిమ తమిళనాడులో నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఒక సామాజిక సాంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. దాన్ని ఆచార్య పెరుమాళ్ మురుగన్ తమిళంలో ‘మధోరు బాగన్’ అనే నవలగా 2010లో రాశాడు. దాని తెలుగు అనువాదమే “అర్థనారీశ్వరుడు.” 1940 సంII నేపథ్యంలో వ్యవసాయము, పశుపోషణ జీవనంగా గల ఒక జంట కాళి, పొన్నల కథ ఇది. ఎన్ని “గుళ్ళూ, గోపురాలు దర్శించినా” సంతానం కలగదు. పిల్లలు కలగనప్పుడు తిరుచెంగోడు అర్థనారీశ్వరుడికి జరిగే రథోత్యవం వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదిలి, ఆ రాత్రి ఎవరు ఎవరితోనైనా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనవచ్చుననే సాంప్రదాయం ఆనాడు ఉండేది. దీని నాధారంగా చేసుకొని హృద్యంగా ఈ నవల రచించబడింది. పశ్చిమ తమిళనాడులోని కొంగునాడు ప్రాంతంలోని కొన్ని సామాజిక వర్గాలు మురుగన్ మీద కాలు దువ్వినాయి. అలజడి ప్రారంభమయింది. ఈ నవలలో ప్రస్తావించిన అంశాలు తమ సామాజిక వర్గాన్ని, స్త్రీలను కించపరచేవిగా ఉన్నదనీ, దీన్ని నిషేధించాలనీ కొన్ని హిందూ మతోన్మాద సంస్థలూ, కుల సంఘాలు, వక్రమార్గంలో ఎడతెరిపి లేని అందోళన అన్ని రూపాల్లో కొనసాగించాయి. రచయితైన మురుగన్‌ను వేటాడారు. దాదాపుగా సాంఘిక బహిష్కరణ చేశారు. మురుగన్‌తో ప్రభుత్వ అధికారుల సమక్షంలో క్షమాపణ చెప్పించాయి. అయినా గొడవ కోర్టుదాకా వెళ్ళింది. విచారణ సంIIర కాలం జరిగింది. మతోన్మాదుల ఉన్మాదాన్ని కోర్టు కొట్టివేసింది. ఈ రచనను తెలుగులోకి ప్రసిద్ధ రచయిత ఎల్.ఆర్. స్వామి అనువదించారు.
స్త్రీ పురుషుల భావోద్వేగాలలో, ఆలోచనల్లో చాలా తేడాలుంటాయి. వాటిని అనుభవించే తీవ్రత – ముఖ్యంగా మాతృత్వం – స్ర్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు కోల్పోకూడనిది ఆత్మవిశ్వాసం, ఆత్మబలం. జీవితమంటేనే అనుభవం. మన అనుభవాలకే కాకుండా ఇతరుల అనుభవాలకి స్పందించగలిగినప్పుడు, ఆ స్పందన తీవ్రతని అక్షర రూపంగా మార్చగలిగినప్పుడు కథ పుట్టడమే కాదు ఆ కళ మనలోని చైతన్య స్థాయినీ పెంచుతుంది. అసలు సిసలు సత్యాన్వేషణకీ, ప్రపంచం పట్ల నిర్వేదానికి మధ్యనున్న సన్నటి గీతను చూపించే తాత్విక విశ్లేషణ, జీవితాంతం తనను నడిపించిన భావన ఏమిటో తెలుసుకున్నప్పుడు కలిగిన స్ఫురణ – ఈ ‘ఆకాశమల్లి’ కథల నిండా కనబడతాయి.
కన్యాశుల్క పద్ధతి "ధర్మశాస్త్ర విహితమైనదో కాదో" తేల్చిచెప్పండని ఉత్తరాంధ్రలోని విజయనగర పాలకుడు ఆనంద గజపతి రాజు పండితులను కోరాడట. "శాస్త్రం నిర్ణయించిన దానికంట్ అధికధనం స్వీకరిస్తే కన్యా విక్రయదోషం తప్పదు; కాబట్టి అది అధర్మమే అవుతుందని "ప్రసిద్ధ పుణ్యక్షేత్రం" కాశీలోని ఆనాటి సంస్కృత పండితులు చెప్పారట. బాల్య వివాహాలను గురించిన భోగట్టా సేకరించాలని, ఆ దురాచారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలనీ, ఆ భాద్యతను గురజాడమీద పెట్టారట ఆనంద గజపతిరాజు. గురజాడవారు కూడా తన నాటకం ముందుమాటలో ప్రస్తావించారు. దీన్నే ఇతివృత్తంగా స్వీకరించి గురజాడ ఈ నాటకాన్ని 1892కి పూర్వం రాసి ఉండవచ్చు. 1892 ఆగస్టులోనే మొదటిసారి జగన్నాధ విలాసినీ సభవారిచే "కన్యాశుల్కం" నాటకం ప్రదర్సించబడింది. దాదాపు నూటపాతిక సంవత్సరాలైనా ఇప్పటికీ ఈ నాటకం ఆదరించబడుతూ, సజీవంగా ఉందంటే అతిశయోక్తి కాదు.
కన్యాశుల్క నాటకం ఆ రంగంలో గొప్ప ప్రయోగం. వ్యవహారిక భాషకు పట్టం గట్టిన మొదటి "దృశ్యకావ్యమిది". సమాజంలోని అన్ని తరగతుల అభిప్రాయాలనూ, వారి కష్టసుఖాలనూ సజీవమైన వ్యవహారిక భాషలో వ్యక్తీకరించబడిన మొదటి నాటకం. "గురజాడ సృష్టించిన కన్యాశుల్కం ఆంధ్ర వాఙ్మయ ప్రపంచంలోనే కాకుండా భారతీయ భాషా నాటక వాఙ్ణయ ప్రపంచంలో ప్రధమశ్రేణిలో ప్రకృష్ట స్థానాన్ని ఆక్రమిస్తుంది..." "కన్యాశుల్క నాటకం కేవలం నాటకమే కాదు, అది యానాటి తెలుగువారి రాజకీయ, సాంఘిక, సాహిత్య జీవనమునకు అద్దం వంటిది. సంఘంలో కరుడుగట్టిన దోషములనే కాక, ప్రాచ్య పాశ్చాత్య నాగరికతా సంఘర్షణలో సంఘ పరిస్థితులు, చరిత్ర చక్కగా నిరూపించే ఒక విజ్ఞానకోశము వంటిది" అని నిడదవోలు వెంకటరావు గారన్నారు.
ఈ నాటకం ఆంధ్రదేశంలో జైత్రయాత్ర సాగించింది. రచయిత రాసిపెట్టిన ఛలోక్తులు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతించారు. నాటక సందేశంప్రజలకందింది. కన్యాశుల్క దురాచారమొక్కటేగాక, అనేక సాంఘిక దురన్యాయాలు హేళనకు గురయ్యే స్థాయికి అప్పరాయ కవీంద్రులు నడిపించారంటే అతిశయోక్తి కాదు. సామాన్య మానవులు నాటక పాత్రలై, సంఘ సమస్య నాటక ఇతివృత్తమై, ఆంధ్ర నాటక సాహిత్యంలో కన్యాశుల్క నాటకం శిరోధార్యమైంది. 1929లో బాల్యవివాహ నిషేధ చట్టం రూపుధరించడానికి కన్యాశుల్క నాటకం ఒక ప్రబలమైన శక్తినిచ్చిందంటే ఆశ్ఛర్యపడనవసరం లేదు.
గడ్డం కోటేశ్వరరావు, సంపాదకుడు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
"ఔషధీయ మొక్కలు" అనే ఈ విజ్ఞానదాయకమైన పుస్తకంలో డా. పి. శివకుమార్ సింగ్ సర్వసాధారణంగా దొరికే '153' మొక్కలను, వాటి ఔషధ లక్షణాలను, ఔషధం తయారు చేసే విధానము, ఔషధమును వాడునపుడు తీసుకోవాల్సిన పరిమాణం, తినకూడని ఆహార పదార్థాలు మొదలైన జాగ్రత్తలను వివరంగా చర్చించారు.
ప్రస్తుతం పరిశోధనాధారితమైన ఈ పుస్తకంలో '153' మొక్కల ఔషధ విధానాలు క్రొత్తవే అని చెప్పవచ్చును. ప్రతీ మొక్కను వివరించునపుడు సాధారణ గ్రామ ప్రాంతాలలో పిలువబడే పేర్లను, ఫొటోలను ఇవ్వడం ద్వారా సదరు మొక్కను సులువుగా గుర్తుపట్టి, శాస్త్రీయంగా అర్థం చేసుకొనేటట్లు రచయిత వివరించారు.
కావున ఈ విధమైన ఔషధ మొక్కల సమగ్ర సమాచారముతో కూడిన ప్రస్తుత పుస్తకాన్ని పాఠకులుగా మననం ఆదరించి ఉపయోగించి ఆరోగ్య సమాజ స్థాపనలో భాగస్వామ్యులమౌదాం.
డా. పి. శివకుమార్ సింగ్

ఈ పుస్తకంలో “ఇన్‌ఫెక్షన్స్” గురించి, వాటిలోని రకాల గురించి అవగాహన కలగడమే గాక, ఇన్‌ఫెక్షన్స్ పట్ల కనీస పరిజ్ఞానాన్ని పొందుతారు. మామూలుగా ప్రజలు మాట్లాడుకునే సమయంలో “బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్” అనీ, “వైరల్ ఇన్‌ఫెక్షన్స్” అని అంటారే గాని, వాటివల్ల వచ్చే వ్యాధుల గురించి, వాటిని వాడే “యాంటి బయాటిక్స్” గురించి అవగాహన కలిగి వుండరు. అలాగే కామెర్లు, టైఫాయిడ్, టి.బి., జ్వరాలు లాంటివే కాకుండా “హెచ్.ఐ.వి. ఇన్‌ఫెక్షన్స్”, “మలేరియా”, “డెంగ్యూ” జ్వరాలు మొదలైన వాటి గురించి కూడా సామాన్య ప్రజలు ఎక్కువగా అవగాహన కలిగివుండరు. వారి అవగాహన పెంపుదలకు ఈ పుస్తకంలో తగిన విధంగా సమాచారాన్ని రచయిత్రి అందించారు.
ఆయా వ్యాధుల పర్యావసానాలు, వాటి నివారణోపాయాలు ఈ పుస్తకంలో రచయిత్రి డా. కె. ఉమాదేవిగారు సామాన్యులకు సహితం అర్థమయ్యే రీతిలో వివరించారు.
‘మనిషి మట్టిలోనే పుడతాడు. మట్టిలోనే కలిసిపోతాడు. మట్టికీ, మనిషికీ వున్న విడదీయలేని అనుబంధం అలాంటిది. అందువల్ల ఏమట్టికీ తనకూ ఎంత వరకు ఋణముంటుందో అంతవరకే మనిషి ఆ మట్టిమీద పవళిస్తాడు. ఆ మట్టిలో ఊరిన నీళ్ళు తాగుతాడు. ఆ మట్టి మీదనుంచీ వీచేగాలి పీలుస్తాడు. ఆ ఋణం తీరిపోయాక యింకో చోటుకి పోతాడు. అక్కడా ఆ మట్టికీ, ఆ నీటికీ, ఆ గాలికీ ఎంతవరకు ఋణం వుంటుందో అంతవరకు ఆ మట్టిమీదే జీవిస్తాడు. చివరికి ఈలోకం ఋణం ఎక్కడ తీరిపోతుందో అక్కడే ఆ మనిషి అదేమట్టిలో కలిసి పోతాడు. వలస జీవుల్ని ఈ తాత్త్వికతే పట్టి బతికిస్తుంటుంది’. ఈ జీవిత సత్యాన్ని తెలిపే ఓ మట్టిమనిషి యథార్థ, వ్యథార్థ జీవిత చిత్రణే. సాంస్కృతిక, తాత్త్విక రచయితగా ప్రసిద్ధుడైన డా.వి.ఆర్.రాసాని కలం నుంచీ జాలువారిన అరుదైన, విశిష్టమైన నవల ఈ ‘వలస’.